07-07-2025 07:18:43 PM
కోదాడలో అవినీతి రహిత పాలన అందిస్తున్న ఘనత ఉత్తం దంపతులది..
చౌకబారు విమర్శలను మాజీ ఎమ్మెల్యే మానుకోవాలి..
ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ..
కోదాడ: కోదాడ అభివృద్ధిని ఓర్వలేక చౌకబారు విమర్శలను చేయడం మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు తగదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు రాయపూడి వెంకటనారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కోదాడ గంజాయి అడ్డాగా మారింది అంటూ మల్లయ్య యాదవ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. గడిచిన ఏడాదిన్నర కాలంగా అక్రమ గంజాయిపై పోలీస్ అధికారులతో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అనేకమంది గంజాయి అక్రమంగా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసిన సంఘటనలు మీ దృష్టికి రాలేదని విమర్శించారు.
పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాజాత ప్రదర్శనను ఏర్పాటు చేసి అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీస్ అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రజలలో కూడా మార్పు రావాలని పూర్తిస్థాయిలో గంజాయిని రూపుమాపేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కోదాడలో అవినీతి రహిత పాలన కొనసాగుతుందని గత పాలకుల మాదిరిగా అవినీతిమయంగా మారలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఉచిత కరెంటు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ పంట పెట్టుబడి సహాయం సన్న బియ్యం పంపిణీ ఇలా అనేక పథకాల నేరుగా ప్రజలకు అందుతున్నాయని పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని రాబోయే స్థానిక సంస్థలలో కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు.