05-11-2025 01:07:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్4(విజయక్రాంతి): కాగజ్నగర్ పట్టణం నుంచి బోంకిని సిద్ది హనుమాన్ ఆలయం వరకు మంగళవారం నిర్వహించిన 24వ మహాపాదయాత్రకు భక్తజనం పోటెత్తింది. తెల్లవారు జామున 3 గంటల నుంచే ప్రారం భమైన మహాపాదయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది. జిల్లాలోని పలు మండలాల నుండి కాకుండా మంచిర్యాల, పెద్దపల్లి, మహారాష్ట్ర నుండి 20 వేల మందికిపైగా తరలి రావడంతో దారులన్నీ కిక్కిరిశాయి.
భక్తులు ఆలయానికి చేరు కొని క్యూ కట్టి అంజన్నను దర్శించుకున్నారు. దేవస్థానం పరిసరాలు కిటకిటలాడాయి. సిర్పూ ర్(టీ) నియోజకవర్గ పరిధిలోని అధికారులు, రాజకీయ నాయకులు స్వామి వారికి మొక్కులు తీర్చుకున్నారు.స్వచ్చంద సంస్థలు, రాజకీయ నాయకులు పండ్లు, మజ్జిగ, పాలు, చాయ్ అందించారు. మహాపాదయాత్రగా వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.