15-08-2024 12:00:00 AM
రెండేండ్లలో తొలిసారి తగ్గుదల
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశంలో పాసింజర్ వాహన విక్రయాలు జూలై నెలలో 2.5 శాతం క్షీణించి 3,41,510 యూనిట్లకు తగ్గినట్టు ఆటోమొబైల్ పరిశ్రమ అసోసియేషన్ సియామ్ తెలిపింది. గత ఏడాది జూలైలో బేస్ ఎఫెక్ట్ (3,50,355 యూనిట్లు) అధికంగా ఉన్నందున, ఈ జూలైలో క్షీణత చవిచూసినట్టు తెలిపింది. డిమాండ్ మందగించిన కారణంగా డీలర్లకు కార్ల కంపెనీల డిస్పాచ్లు తగ్గాయ న్నది. రెండేండ్లుగా కార్ల అమ్మకాలు తగ్గడం 2024 జూలైలోనే. పాసింజర్ వాహనాల్లో యుటిలిటీ వాహన విక్రయాలు మాత్రం 1,80,831 యూనిట్ల నుంచి 1,88,217 యూనిట్లకు పెరిగినట్టు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ గణాంకాలు వెల్లడించాయి. అయితే పాసింజర్ కార్ల అమ్మకాలు 12 శాతం తగ్గి 1,09,859 యూనిట్ల నుంచి 96,652 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ద్విచక్ర వాహన విక్రయాలు జూమ్
తాజా సియామ్ గణాంకాల ప్రకారం జూలై నెలలో ద్విచక్ర వాహన అమ్మకాలు 12.5 శాతం వృద్ధితో 12,82,054 యూనిట్ల నుంచి 14,41,694 యూనిట్లకు పెరిగాయి. మోటార్సైకిళ్ల విక్రయా లు 4.1 శాతం వృద్ధితో 8,17,206 యూనిట్ల నుంచి 8,50,489 యూనిట్లకు చేరగా, స్కూటర్ల అమ్మకాలు భారీగా 29.2 శాతం ఎగిసి 4,28,460 యూనిట్ల నుంచి 5,53, 642 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహన అమ్మకాలు 5 శాతం పెరిగి 56,204 యూనిట్ల నుంచి 59,073 యూనిట్లకు పెరిగాయి.