31-10-2025 10:18:32 AM
 
							హైదరాబాద్: ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఎం రైతు సంఘం నాయకుడు, మాజీ సర్పంచ్ సామ్నేని రామారావును(CPM leader Samineni Rama Rao) గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దుండగులు అతని గొంతు కోసి అక్కడికక్కడే చంపేశారు. ఈ దారుణ సంఘటన రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. సీపీఎం నేత సామినేని రామారావు హత్యపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామారావు కుటుంబానికి భట్టి విక్రమార్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) హింసా రాజకీయాలకు తావు లేదన్న డిప్యూటీ సీఎం నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి(Deputy CM) ఖమ్మం పోలీసు అధికారులను ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడాలని ఆదేశించారు. నిందితులను వీలైనంత త్వరగా గుర్తించి అరెస్టు చేయడానికి క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీంలు, అందుబాటులో ఉన్న అన్ని ఆధునిక దర్యాప్తు సాంకేతిక పరిజ్ఞానాలను మోహరించాలని ఆదేశించారు. అక్రమాలు, శాంతికి విఘాతం కలిగించే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని తేల్చిచెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. సామినేని రామారావు(Samineni Rama Rao) కుటుంబానికి సంతాపం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి, ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని, పూర్తి మద్దతు ఇస్తానని భట్టి విక్రమార్కపేర్కొన్నారు.