20-09-2025 09:10:48 PM
కుభీర్: నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ గ్రామంలోని కురుమల ఆరాధ్య దైవం బీరప్ప దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో దుండగులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ కుభీర్ మండలం పల్సి గ్రామంలోని కురుమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కురుమ సంఘం ఆధ్వర్యంలో శనివారం కులస్తులు స్థానిక బీరప్ప దేవాలయం ఎదుట దుండగులను అరెస్టు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆందోళన నిర్వహించారు.
దుండగులను పట్టుకుని అరెస్టు చేయకపోతే జిల్లావ్యాప్తంగా కురుమ కులస్తులు ఆందోళనలకు దిగుతారని హెచ్చరించారు. ఈ సంఘటనపై నిర్మల్ జిల్లా కురుమ కులస్తులు ఆయా పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదులు చేశారని దుండగులను అదుపులోకి తీసుకొని కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.