17-08-2025 11:12:47 PM
నియమనిబంధనలు తప్పనిసరి
నవాబ్ పేట ఎస్సై విక్రమ్
మహబూబ్ నగర్: నవాబు పేట గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వారు ఆన్లైన్ లో సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని.. అనుమతులు వచ్చిన తర్వాతనే మండపాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ విక్రం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భద్రత, బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం అని తెలంగాణ రాష్ట్ర పోలీసు వెబ్సైట్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపులకు అనుమతి కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని గ్రామాలలో గణేష్ మండపాల నిర్వహణకు మండపాల నిర్వహకులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ https://policeportal.tspolice.gov.in/నందు ధరఖాస్తు చేసుకోవాలని, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ, మండపానికి సంబంధించిన సమాచారం కొరకు మాత్రమేనని,
ఈ సమాచారంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత, బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులభంగా ఉంటుందని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారని సూచించారు. పోలీసు శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని,ఆ తరువాతనే వినాయక మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.గణేష్ మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదేనని. ప్రతి మండపం వద్ద తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలి. గణేష్ మండపాలు ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలకు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
మండపాల కమిటీ వివరాలు, బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో శోభాయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేల ను ఏర్పాటు చేయరాదు. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తగా దగ్గరలో రెండు బకెట్ల నీళ్లు ఏర్పాటు చేయాలి.
గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, అసభ్యకరమైన నృత్యాలు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు/పాటలు పూర్తిగా నిషేధం. విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసు అధికారుల తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు. అనుమానాస్పదమైన బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు, వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదని, ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు అధికారులను లేదా 100 డయల్ నంబర్ను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.