17-08-2025 11:57:10 PM
జిల్లా పోలీస్ శాఖకు జాగీలం పింకీ అందించిన సేవలు మరువలేనివి
నల్గొండ క్రైం: అనారోగ్యంతో మరణించిన పోలీస్ జాగిలంకి ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘనoగా అతిమ వీడ్కోలు పలికి అధికారికంగా దహన సంస్కారాలు చేశారు-జిల్లా పోలీస్ శాఖకు జాగీలం (పింకీ ) అందించిన సేవలు ఎంతో గుర్తింపు తెచ్చాయి. అనేక కీలక కేసులలో నేరస్థులను డిటెక్ట్ చేసి పోలీస్ శాఖకు వెన్ను దన్నుగా నిలిచి 12 సంవత్సరాల కాలం పాటు విధి నిర్వహణలో విశేష సేవలు అందించి అనారోగ్య కారణంగా మరణించడం చాలా బాధాకరం అని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
2014 సంవత్సరంలో ఐఐటీ మొయినాబాద్ లో 9 నెలల పాటు డాగ్ హ్యాండ్లర్ నాగరాజుతో పాటు శిక్షణ పొంది శిక్షణా కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించిందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో విధినిర్వహణలో భాగంగా నల్లగొండ 1 టౌన్ పరిదిలో బొట్టుగూడలో ఒక వ్యక్తిని ముక్కలు ముక్కలుగా చేసి పలు చౌరస్తాలలో తల మొండెం వేరు చేసిన సంచలన హత్య కేసులో కీలకమైన పాత్ర పోషించింది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హల్ వద్ద జరిగిన రూ.కోటి 40 లక్షల చోరీ కేసులో గంటల వ్యవధిలో నిందితుల జాడలను తెలిపింది. గుండాల మండలం లోని వంగాల గ్రామం లో ఒక వ్యక్తిని చంపి బావిలో పడవేసిన వారం రోజుల తరువాత ఈ డాగ్ తో అన్వేషణ చేస్తే నిందితుల ఇండ్లలోకి వెళ్లి పసిగట్టింది. ఇలా పింకీ విధినిర్వహణలో చేసిన సేవలు పోలీస్ శాఖకు మంచి గుర్తింపు తెచ్చింది. అడిషనల్ ఎస్పి రమేష్ పూలమాల వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి అధికార లాంఛనాల తో అంత్య క్రియలు నిర్వహించారు.