31-07-2025 12:28:01 AM
- రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్
-ఎమ్మెల్యే పాయల్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ ఎంపీటీసీ
ఆదిలాబాద్, జూలై 30 (విజయక్రాంతి): 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, సుమారు 18 నెలలుగా పాలన సాగిస్తున్న కాం గ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంను అప్పుల పాలు చేసారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సాత్నాల మండలం జామిని గ్రామ మాజీ ఎంపీటీసీ రేణుక బాయితో పాటు పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సం దర్భంగా వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈమేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామా ల్లో ఇళ్ల నిర్మాణాలు, సీసీ రోడ్లు, పానాది రోడ్ల నిర్మాణాలు, అంగన్వాడీ భవనాలు, చివరికి స్మశాన వాటికల నిర్మాణాలు సైతం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాగుతున్నాయని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేదలకు చేరవేయడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చే అభ్యర్థులను గెలిపించి, పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు తోపాటు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.