23-05-2025 01:43:15 AM
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు
మెదక్, మే 23(విజయ క్రాంతి): పేదల జీవితాలలో వెలుగులు నింపే దిశగా మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాల ముమ్మర ప్రగతి సాధించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధికారులకు సూచించారు. గురువారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
విద్యా, వైద్యం, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్యశాఖ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, వివిధ సంక్షేమ శాఖల వారి అభివృద్ధి సంక్షేమ పథకాలపై అమలుతీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు శాఖల వారీగా ప్రజలకు అందించే కార్యక్రమాలను లక్ష్యాలను పూర్తి చేసి ప్రారం భించే దిశగా చూడాలన్నారు. సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు.
మెదక్, రామయంపేట్ మున్సిపల్ కమిషనర్స్ మున్సిపాలిటీలలో పరిసరాల పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్య ధోరణిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమీషనర్స్ తీరు మార్చుకోకుండా వ్యవహరిస్తున్నారని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఉపేక్షించేది లేదన్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై సమీక్షల ద్వారా అధికారులకు సూచనలు సలహాలు అందిస్తున్నామని శాసనసభ్యులు సమావేశంలో చర్చించిన అంశాలను క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలను నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, మెదక్ ఆర్డిఓ రమాదేవి, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.