09-05-2025 09:53:41 PM
కాటారం,(విజయక్రాంతి): సమాజంలోని నిరుపేద కుటుంబానికి సహాయం చేసి ట్రాన్స్ జెండర్లు తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మద్దులపల్లి గ్రామంలో ట్రాన్స్ జెండర్ ల శిబిరం ఉంది. కాగా గతవారం రోజుల క్రితం మద్దులపల్లి గ్రామానికి చెందిన మారపాక దుర్గయ్య అనే ఇంటి యజమాని అకాల మరణం చెందడంతో నిరాశ్రయులైన కుటుంబ సభ్యులకు ట్రాన్స్ జెండర్లు చేయూతను అందించారు. ఈ మేరకు వారు నెల రోజులకు సరిపడే బియ్యం, వంట సామాగ్రి తో పాటు నిత్యావసర సరుకులు, కొంత నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు అడువాల రూప, సల్లపు గౌరీ, సాన్విత, ఫ్రూటీ, మోక్ష, తదితరులు పాల్గొన్నారు. నిరాశ్రయులైన కుటుంబానికి ట్రాన్స్ జెండర్లు చేయూతను అందించడం పట్ల పలువురు అభినందించారు.