25-08-2025 07:40:18 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను పెండింగ్ లో ఉండకుండా, వాటిని త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్(District Collector Sneha Shabarish) అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు జిల్లా కలెక్టర్ కు అర్జీలను అందించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు తమ అభిప్రాయాలను, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సంబంధిత శాఖల అధికారులను అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజలు చెప్పిన అభిప్రాయాలను కలెక్టర్ వింటూ వినతి పత్రాల్లోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 177 అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఆర్ఓ వై వి గణేష్, డిఆర్డిఓ మేన శీను, హనుమకొండ పరకాల ఆర్డివోలు రాథోడ్ రమేష్, డాక్టర్ కె.నారాయణ, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసిల్దార్లు పాల్గొన్నారు.