25-08-2025 09:22:54 PM
ఖమ్మంపల్లి మానేరు నుంచి హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా
రోజు రాత్రి రెండు గంటలకు లారీల్లో తరలిస్తున్న ఇసుక
నిద్రమత్తులో అధికారులు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపాదిస్తున్న ఆ ప్రజాప్రతినిధులు
ముత్తారం,(విజయక్రాంతి): ఖమ్మంపల్లి టు హైదరాబాద్ కు ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరు నుంచి హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా అధికారుల సహకారంతో సాఫీగా సాగుతుందని గ్రామస్తులే ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు మానేరు నుంచి రాత్రి రెండు, మూడు గంటలకు లారీల్లో ఇసుకను గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న నిద్రమత్తులో అధికారులు ఉన్నారని గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధిల కనుసైగలో జోరుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా సాగుతుందని, అ ప్రజాప్రతినిధులు మూడు పువ్వులు ఆరు కాయలుగా సంపాదిస్తున్నారని, గ్రామంలోని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.
ఖమ్మంపల్లి మానేరు నుంచి ప్రతిరోజు పట్టపగలు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకపోతున్నప్పటికీ పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఒకరిపై ఒకరు తమకు సంబంధం లేదని దాటవేసుకుంటూ ఇసుక అక్రమ రవాణా ప్రోత్సహిస్తున్నారని, గ్రామస్తులు తెలుపుతున్నారు. గ్రామస్తులు అక్రమ ఇసుక తరలిపోతుందని పోలీసులకు రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని అంటున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు.
గ్రామంలో జోరుగా అక్రమ మట్టి దందా
గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతిని దర్చాగా జెసిబిలను తీసుకువచ్చి గత కొంతకాలంగా ఇసుక, మట్టి దందా చేస్తున్నాడని, గ్రామంలో ఒక పేదవాడు ఇల్లు కట్టుకుంటే మట్టి ఇసుక తరలిస్తే పట్టుకునే అధికారులు ఈ నాయకుడు ఇంత పెద్ద ఎత్తున అక్రమ దందా నడిపిస్తుంటే ఎందుకు పట్టుకుంటే లేరని గ్రామస్తులు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అసలు అధికారులు ఉన్నారా... పని చేస్తున్నారా...
ఆదివారం వచ్చిందంటే గ్రామంలో మట్టిదందా జోరుగా నడుస్తుందని, నిన్న పెద్ద ఎత్తున ట్రాక్టర్లు తీసుకువచ్చి మట్టి దందా నడిపించాడని, అసలు అధికారులు ఉన్నారా.... పని చేస్తున్నారా... అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత కొంతకాలంగా అక్రమ దందాలు మూతపడగా, మళ్లీ గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకున్న సంబంధాలతో తనును ఎవరు ఏమి చేయలేరని
అహంకారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ... మీ సంగతి చూస్తా అంటూ... రాత్రి పగలు తేడా లేకుండా ఏకచిత్రాధిపతిగా ఇసుక, మట్టి దందా నడిపించి కోట్ల రూపాయలు కొల్లగొడుతూ తన జేబులు నింపుకుంటున్నాడని, ఇప్పటికే ఆ ప్రజాప్రతిని గ్రామంలో తనను ఎవరు ఏం చేయాలని, అధికారులు అందరూ తన కనుసైగాలో ఉన్నారని, వారికి నెలనెలా మామూలు ఇస్తున్నానని చెప్తున్నాడని గ్రామస్తులు తెలుపుతున్నారు.
కలెక్టర్ ఖమ్మంపల్లిపై కన్నయ్యండి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఖమ్మంపల్లిపై ఓ కన్నయ్యండి సారు అంటూ గ్రామస్తులు కోరుతున్నారు. కలెక్టర్ మీరు పట్టించుకోకుంటే ఇక ఆ ప్రజా ప్రతినిధులను ఎవరు ఏం చేయలేరని విర్రవీగుతున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ ఖమ్మంపల్లిపై నిఘా పెట్టి అక్రమ దందాలకు చెక్కు పెట్టాలని, గ్రామ ప్రజలు కలెక్టర్ ను కోరుతున్నారు.