06-08-2024 01:59:02 AM
హైదరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా ఏ చిన్న తప్పు జరిగినా ఊరుకోబోమని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు కలెక్టర్లతో తొలిసారి సోమవారం అమరావతిలో సమావేశం నిర్వహించారు. తమ ఐదేళ్ల కాలంలో పాలన ఎలా ఉం డాలో, ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమిటో వివరించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించామని, కలెక్టర్లు, అధికారులు కూడా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రజల్లోకి మరోసారి వెళ్లి ఓట్లు అడగాలి అంటే పథకాల అమలు, లబ్ధిదారుల గుర్తింపు మొదలగు విషయాల్లో నాయకులతోపాటు అధికారులంతా నిబద్ధతతో పని చేస్తేనే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనిచేయాలని, రాబోయే సమస్యలను ముందుగానే అంచనా వేసి వాటికి అందరినీ సంసిద్ధులను చేయాలని చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ, అవసర మైతే పొరుగు జిల్లాల అధికారుల సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
ఐదేళ్ల విధ్వంసపాలతో నష్టపోయారు
గత ప్రభుత్వ ఐదేళ్ల విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. చిన్న తప్పు జరిగితే సరిచేయవచ్చు కానీ, విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించాలంటే కష్టపడాలని తెలిపారు. మన నిర్ణయాలకు రాష్ర్ట భవిష్యత్తును మార్చే శక్తి ఉందని, మనమంతా కష్టపడితే 2047 నాటికి మూడో అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఎప్పటికప్పుడు లక్ష్యాలను నిర్దేశిం చుకుని ముందుకుపోవాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా సమయపాలన పాటిస్తానని, గంటలు గంటలు ఉపన్యాసాలు ఇవ్వనని, తన పనితీరుపైనా రివ్యూ ఉంటుందని వెల్లడించారు. ఎవరు పనిచేయకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలి: పవన్ కల్యాణ్
గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకుని నిలబడ్డామని, బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆట బొమ్మలుగా మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, పాలన ఎలా ఉండకూడదనే దానికి గత ఐదేళ్ల ప్రభుత్వ తీరు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని అన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముంద డుగు వేస్తున్నామని, ఇందులో భాగంగా ఒకేరోజు రాష్ర్టంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు.