18-12-2025 01:24:29 AM
ఏఐలో సృష్టిస్తున్న అసభ్యకర కంటెంట్ను ప్రోత్సహించొద్దంటూ హీరోయిన్ శ్రీలీల కోరింది. శ్రీలీల బాత్రూం ఫొటోలంటూ నెట్టింట చక్కర్లు కొడుతున్న పోస్టులపై ఆమె స్పందించింది. అవి ఏఐ సహాయంతో మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ ఫొటోలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది శ్రీలీల. “అర్థరహితమైన కంటెంట్ను ప్రోత్సహించవద్దని సోషల్ మీడియా వినియోగదారులందరినీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నా.
టెక్నాలజీని వాడుకోవడం వేరు, దాన్ని వేధించడానికి ఉపయోగించడం వేరు. సాంకేతికత అనేది మన జీవితాలను మెరుగుపరచాలి కానీ, ఇలా ఇబ్బందుల్లోకి నెట్టకూడదు. కళను వృత్తిగా ఎంచుకున్నా సరే, ప్రతి అమ్మాయి ఒకరి కూతురో, సోదరో లేదా స్నేహితురాలో అన్న విషయం మర్చిపోవద్దు.
మేము ఎంతో ఇష్టపడే ఈ సినీ పరిశ్రమలో మాకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో పని చేయాలనుకుంటున్నాం. కొన్ని రోజులుగా ఆన్లైన్లో జరుగుతున్న ఈ అసభ్యకరమైన పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేశాయి. నా తోటి నటీమణులు కూడా ఇలాంటి వేధింపులకే గురవుతున్నారు. కాబట్టి వారందరి తరపున నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నా. ప్రేక్షకులు మాకు అండగా ఉంటారని ఆశిస్తున్నా” అంటూ శ్రీలీల రాసుకొచ్చింది.