06-01-2026 01:15:25 AM
అధికారులపై హనుమకొండ కలెక్టర్ సీరియస్
కొత్తకొండ జాతరపై సమీక్ష
భీమదేవరపల్లి, జనవరి 5 (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సుప్రసిద్ధ పుణ్యక్షత్రమైన కొత్తకొండ వీరభద్ర స్వామి జాతర మరో నాలుగు రోజుల్లో జరగనున్న నేపథ్యంలో జాతర పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ జాతర పనులపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఆ గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతర అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తనకు ఫోన్ చేశారని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న పనులపై ముల్కనూర్ ఎస్సు రాజు విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన కథనంపె కలెక్టర్కు వివరించారు. రెండు రోజుల్లోగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న కందకాలను పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధికారులు చొరవ తీసుకొని అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. కొత్తకోట గ్రామంలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని సర్పంచ్ రమ కలెక్టర్కు విన్నవించారు.