01-08-2025 01:10:35 AM
హౌసింగ్ కార్పొరేషన్ ఎండి పీవీ గౌతం
యాదాద్రి భువనగిరి జూలై 31 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల లోని మండలాలైన తుర్కపల్లి మండలం వాసలమర్రి, బీబీనగర్ మండలం కొండమడుగు, బొమ్మలరామారం మండలంలోని నాగినేని పల్లి, మేడిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ముఖాముఖీగా మాట్లాడారు.
సొంత ఇంటి కలను నిజం చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వి.పి గౌతం సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు తీరును పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్లను పరిశీలిస్తూ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల రూపాయలతోనే,అన్ని వసతులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చని వివరిస్తూ, స్థానికంగా మేస్త్రీలకు చెల్లిస్తున్న ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు. మేస్త్రీలకు చెల్లింపులు అధికంగా ఉన్నాయని వాటిని తగ్గించుకోవాలని తెలిపారు.
ఒకటి రెండు చోట్ల నిర్మాణపు పను ల్లో 16 ఎంఎం స్టీల్ వాడకాన్ని గమనించి 12 ఎంఎం స్టీల్ ను వాడితే సరిపోతుందని మేనేజింగ్ డైరక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి,హౌసింగ్ కార్పొరేషన్ ఈ డి.విజయసింగ్, ఎంపిడివో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.