11-03-2025 10:50:22 PM
ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): పెరుగుతున్న జనాభా కనుగుణంగా డ్రైనేజీ సౌకర్యాన్ని పెంచాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్లోని ఆర్య సమాజ్ నుండి దాదాపు రూ. 20 లక్షల వ్యయంతో కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణం పనులను ఆయన సందర్శించి పరిశీలించారు. ఆర్య సమాజ్నుండి కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సగం వరకే కాంట్రాక్టర్లు చేపడుతున్నారని స్థానిక బీఆర్ఎస్ నాయకురాలు రూపతో పాటు బస్తివాసులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కలిసి విన్నవించారు.
ఈ సందర్భంగా జలమండలి డీజీఎం కార్తీక్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జై సింహా, డివిజన్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్ యాదవ్ లతో కలిసి ఆయన ఆర్య సమాజ్ నుండి కొనసాగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు. బస్తీల్లో డ్రైనేజీ సమస్య ఉన్నందున అన్ని బస్తీలు, కాలనీలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో డ్రైనేజీ సౌకర్యాన్ని పెంచాలని ఆయన అధికారులను, కాంట్రాక్టర్లను కోరారు.
డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన తర్వాతనే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు రాధ, శ్రీనివాస్ లతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.