27-09-2025 11:29:07 PM
ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విధులు కేటాయించబడిన అధికారులు ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎంపీటీసీ/ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమైనదని తెలిపారు.
నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత నామినేషన్ పత్రాల స్వీకరణ నుండి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి అయ్యేవరకు అధికారులు తమకు అప్పగించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు లోబడి విధులు నిర్వర్తించాలని, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు అందించిన హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని, మాస్టర్ ట్రైనర్లు ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.