10-12-2025 02:53:22 AM
గృహ నిర్మాణ విధానం రూపకల్పన
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణా రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక అని పేర్కొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్లో భాగంగా మంగళవారం ‘అఫర్డ్ బుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్భన్ ఫ్యూచర్ తెలంగాణా మోడల్ 2047’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కీలక ఉపన్యాసం చేశారు. పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన, సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు.
మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు ఒక లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. ప్రభుత్వ లక్ష్యానికి మూలస్తంభం లాంటి తెలంగాణ- 2047ను ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్ని రూపొందిస్తున్నామని ప్రకటించారు.