02-09-2025 12:46:31 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): గణనాథుడి వీడ్కోలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. నగరంలో 303 కిలోమీటర్ల మేర సాగే ప్రధాన శోభాయాత్ర మార్గా ల్లో పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కర్ణన్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన నెక్లెస్ రోడ్డు మార్గంలో నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
పీపుల్స్ ప్లాజా, లేక్ వ్యూ పార్క్, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్ వద్ద బ్యారికేడింగ్, లైటింగ్, క్రేన్ల ఏర్పాటు, కంట్రోల్ రూ మ్ల పనితీరును కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా తనిఖీ చేశారు. నగరంలోని 20 ప్రధాన చెరువులతో పాటు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, డీఆర్ఎఫ్ బృందాలు, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పోలీసు ల సహకారంతో 13 కంట్రోల్ రూమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ఊరేగింపు సజావుగా సాగేందుకు 160 ప్రత్యేక గణేష్ యాక్షన్ బృందాలను నియమించామని వివరించారు. నిమజ్జనం సందర్భంగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు 14,486 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనిచేస్తారని కమిషనర్ తెలిపారు.
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు
ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని జీహెఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. సో మవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్వయంగా కమిష నరే ఫిర్యాదులను స్వీకరించి, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎం సీ వ్యాప్తంగా ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో కలిపి మొత్తం 122 ఫిర్యాదులు అందాయి.