13-10-2025 01:10:35 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, అక్టోబర్ 13(విజయక్రాంతి): నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై, జెండా ఊపి వాకథాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ప్రస్తుత దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అనేకమంది అనారోగ్యానికి లోనవుతున్నారని, ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఎస్వీఎస్ ఆసుపత్రి,మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించడం అభినందనీయం అని అన్నారు.
ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమన్నారు. ఆరోగ్యంగా , ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్, వ్యాయామం అవసరమన్నారు. ఆర్థోపెడిక్ కు సంబంధించి ఎస్వీఎస్ ఆసుపత్రి లో సురక్షితమైన అధునాతన ఎక్విప్మెంట్స్ తో అన్ని రకాల శాస్త్రం చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, తెలంగాణ రాష్ర్టంలోనే బెస్ట్ ఆసుపత్రిగా ఎస్వీఎస్ ఆసుపత్రి అని చెప్పారు. అనంతరం పద్మావతి కాలనీ కష్ణ టెంపుల్ కమాన్ నుంచి ఏనుగొండ వరకు వాకథాన్ లో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కె జె రెడ్డి, డాక్టర్ కష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, కర్నాకర్ రాజు పాల్గొన్నారు.