13-10-2025 12:00:00 AM
-రోజురోజుకు మితిమీరిపోతున్న మాఫియా ఆగడాలు..
-మార్గదర్శకాలకు తిలోదకాలు
-గోదావరి నదిని తోడేస్తున్న అక్రమా ర్కులు
-దర్జాగా దందా.. నిబంధనలకు పాతర
-ప్రశ్నించిన పౌరులపై దాడి చేసేంత అండదండలు ఎవరిస్తున్నారు..?
-మణుగూరులో మాఫియా స్వైర విహారం
-ఆ ప్రజాప్రతిని మౌనం వెనక ఆంతర్యమేమిటి..?
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 12 (విజయక్రాంతి ) : ఇక్కడ అడిగేవారు ఉండరు, అపే వారు ఉండరు, తొవ్వుకున్నోళ్లకు తొవ్వు కున్నంత, దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. ఏంటి ఈ సిత్రం అనుకుంటున్నారా. నిజమే, ఇది ప్రస్తుతం భద్రాద్రి జిల్లా మణుగూరు మండలంలో కొనసాగుతున్న పలు ఇసుక రీచ్ ల పరిస్థితి. ఇక్కడి నుంచే బి నామీ కాంట్రాక్టర్లు ఇసుక రీచ్ లో అక్రమాలకు తెరలేపారు.
గిరిజనులకు ఉపాధి కల్పించి, అభివృద్ది కోసం కేటాయించిన ఆదివాసీ గిరిజన సోసైటీ ఇసుక ర్యాంపు లను బినాబీ కాంట్రాక్టర్లు చేజిక్కుం చుకుని ఇసుక రీచ్లలో అక్రమాల జాతరకు తెరలేపుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. రాత్రింబవళ్లు ఇసుక లారీలు తిరిగి గ్రామాల రహదారి పూర్తిగా ధ్వంసం అ వుతున్నాపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
వందలాది లారీలను రహదారిపై నిలుపుతూ, రవాణా జరుపుతూ రహదారులను దిగ్బంధనం చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఇదేమిటని అని ప్రశ్నిస్తే వారిపై దాడులకు తెగబడుతు న్నారు. శుక్రవారం ఓ రైజింగ్ కాంట్రాక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమక్షంలోనే ఓ వ్యక్తి పై దాడి చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. దీనిపై విజయ క్రాంతి కథనం..
రాజ్యమేలుతున్న మాఫియా..
నేడు ఉన్న అధికారం.. రేపు ఉంటుందో లేదో తెలియదు..మాట చెల్లినపుడే అనుకున్నది చేసేసుకోవాలి. ఈ పాలసీతోనే నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేతలు ముందుకుసాగుతున్నారట. నియోజకవర్గ నేతలకు ఇసుక దందా ఓ బంగారుబాతుగా మరిందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోట్లు ఆర్జించిపెట్టే అక్షయపాత్ర కోసం పార్టీలు కూడా మారుతారు నేతలు. అధికార పార్టీ ఉంటే ఎవరూ అడ్డు చెప్పరనే ధీమా.
అడ్డొచ్చిన వారిని పోలీసుల సాయంతో బెదిరించొచ్చు. దాడులు చేసినా అడిగేనాథుడు ఉండడు. అనేది వారి ఆంతర్యం. దీంతో మూడు టిప్పర్లు, ఆరు లారీలుగా ఇది యథేచ్చగా సాగు తూనే ఉంది. అక్రమ వ్యాపారులకు ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నా రన్న టాక్ వినిపిస్తోంది. ఇసుక అక్రమ వ్యాపారులు కూడా తాము సంపాదిస్తున్న ఆదాయంలో కొంత మేర ఆయా ముఖ్యమైన నాయకులకు ముట్ట చెబుతుండడంతో నేతలు మౌనంగా ఉన్నారనే చర్చ సాగుతుంది.
టీజీ ఏండీసీ సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహించవలసిన ఇసుక ఎత్తి పోతలు అందుకు విరుద్దంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ అర్ద రాత్రులు కొన సాగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసు కోకపోవడంలో అంత ర్యం ఏమిటోనని గుసగుసలు వెల్లువెత్తు తున్నాయి. మండలంలోని చిన రాయిగూడెం, అన్నారం, కమలాపురం, పూజారి నగర్, కట్టు మల్లారం తదితర గోదావరి పరివాహక గ్రామాల నుండి ఇసుక మాఫియాదారులు అక్రమంగా, రాత్రి పగలు అనే తేడా లేకుండా యదేచ్చగా నది నుండి ఇసుకను బకాసురుల్లాగా తోడు కుంటూ భారీవాహనాలు, టిప్పర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు.
మితిమీరుతున్న ఆగడాలు..
మండలంలో ఇసుక క్వారీల దందా వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. అయితే ఇసుక దందాకు ఓ ప్రజా ప్రతినిధి అండదండలు ఇవ్వడంతో అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో రెచ్చిపో యిన ఇసుక మాఫియా గ్రామాలకు వెళ్లే రహదారులను కూడా వదిలి పెట్టడం లేదు. రహదారిపైనే లారీలను నిలుపుదల చేయటంతో గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ప్రజలకు నెలకొంది. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించిన స్థానిక ప్రజలపై ఇసుక మాఫియా దాడులకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారు.
మరోవైపు ఆదివాసీ గిరిజనులకు ఉపాధి కలిగించే విధంగా మాన్యువల్ గా ఇసుక ఎత్తిపోతలు చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్దంగా భారీ యంత్రాలతో ఎత్తి పోతలు చేపడుతూ టిప్పర్లతో తరలిస్తున్నారు. ఇసుక తవ్వకాలకు ఒక చోట అనుమతులు తీసుకోని మరో చోట తవ్వకాలు చేపడుతున్నట్లు అరో పణలు వెల్లు వెత్తుతున్నాయి. కేంద్ర పర్యావరణ నిబం ధనల ప్రకారం, ఇసుక తవ్వకాలు ఉదయం 6 నుంచి సాయంత్రం 7 వరకు మాత్రమే జరగాలి. అది కూడా సంబంధిత శాఖ అధ్వర్యం లోనే జరగాలనే నిబంధనలు స్పష్టంగా ఉన్నా అందుకు విరుద్దంగా పగలూ రాత్రీ అనే తేడా లేకుండా 24 గంటల పాటు జేసీబీలతో తవ్వకాలు చేపడుతూ టిప్పర్లతో డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
ప్రశ్నిస్తే దాడులు..
మణుగూరులో సానుకూల వాతావరణం ఉంటుంది. రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర సామాజిక సంఘాల మధ్య కక్షలు తక్కువ. ప్రశాంత జీవన విధానం ఎక్కువ మందికి ఉంటుంది. ఎవరి పైనా అడ్డగోలు దాడులు ఉండవు. కానీ ఇసుక మాఫియా రాకతో ప్రశాంత వాతావరణ కి భంగం ఏర్పడుతుంది. ఇసుక మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరై నా ప్రశ్నించడానికి వస్తే ముందుగా డబ్బులు ఎరచూపి సహకరించాలని కోరడం, లేకుంటే దాడులకు దిగడం పరిపాటిగా మారింది.
తమ దందాపై ప్రశ్నించిన వారిని పరుష పదజాలం ఉప యోగిస్తూ, దూషణలకు దిగుతున్నారు. పోలీస్ స్టేషన్లోనే కమలాపురం గ్రామానికి చెందిన యువకుడు పై ఓ రైజింగ్ కాంట్రాక్టర్ పోలీసుల సమక్షంలోనే దాడి చేశాడు. కొందరు అధికారుల అండ ఉండటం వల్లనే వారు దాడులకు దిగు తున్నారని తెలు స్తోంది. అధికారులు ఇసుక అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేక పోతే మాఫియా ఆగడాలు పెరిగి, సామాన్యులపైనా దాడులు చేసే పరి స్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాఫియా ఆగడాల ఫై భయంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమీప గ్రామాల ప్రజలు ఇసుక మాఫియా ను ప్రశ్నించడానికే జంకుతున్నారంటే పరి స్థితిని అర్థం చేసుకోవచ్చు.
పరిశీలిస్తే చాలు, నిజాలు వెలుగు లోకి..
మణుగూరు మండల కేంద్రంలో కొనసా గుతున్న ఇసుక రీచ్లలో అక్రమాలు వెలుగులోకి రావాలంటే సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టవలసిన పని లేదని కేవలం పరిశీలిస్తే అక్రమా లు పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తాయని పలువురు వాదనలు వినిపిస్తున్నారు. ఇసుక రీచ్లలో రాత్రీ పగలూ తేడా లేకుండా అక్రమాల జాతర కొనసాగుతున్నా సంబంధిత శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైన అధికారులు ఇసుక రీచ్లలో కొన సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించి, ఇసుక మాఫియా ఆగడాలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజానీకం కోరుతుంది.