20-05-2025 12:19:18 AM
శివంపేట(మెదక్), మే 19 : ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నెల రోజులైనా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అధిక తరుగుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమవారం పిఏసీఎస్ సీఈఓను రైతులు నిలదీశారు. శివ్వంపేట పిఎసిఎస్ బ్యాంకు ముందు నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెలరోజుల నుండి వడ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర గ్రామాల్లో హమాలీలు 40 రూపాయలు తీసుకుంటే ఇక్కడ అధికంగా రూ.50 వసూలు చేస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యంతో తమ సొంత ట్రాక్టర్లలో ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలిస్తే క్వింటాల్ కి 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆరోపించారు.
వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పన్లతోపాటు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని రైతులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ఐ మధుకర్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి రైతులకు సర్ది చెప్పి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకోను విరమింప చేశారు.