calender_icon.png 27 August, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పంచాయతీ ఎన్నికలకు.. 2న ఓటర్ల తుది జాబితా

27-08-2025 12:55:04 AM

  1. జీపీల్లో వార్డుల వారిగా ఓటర్ల జాబితా ప్రదర్శన 
  2.   28న గ్రామ, మండల పరిషత్ కార్యాలయాల్లో.. 
  3.   29న జిల్లా ఎన్నికల అధికారులు, పార్టీల సమావేశం 
  4.   30న  ఎంపీడీవోలు, పార్టీల ప్రతినిధులతో భేటీ
  5.   28 నుంచి 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
  6. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు  

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వంతో పాటు పార్టీలు సన్నద్ధం కావడంతో తాజాగా రాష్ర్ట ఎన్నికల కమిషన్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారులకు రాణి కుముదిని కీలక ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 2న ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 28న గ్రామ పంచాయతీ, మండల ప్రజాపరిషత్ కార్యాలాయాల్లో ప్రదర్శిస్తారు. ఈ నెల 29న జిల్లా ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 28 నుంచి 30 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి పరిష్కరించనున్నారు. వచ్చే నెల 2న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనున్నారు.