26-08-2025 02:50:05 AM
మిషన్ వాత్సల్య పథకం ద్వారా అందజేత
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి) : ప్రముఖ సినీ హిరో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన బాధిత కుటుంబాన్ని మిషన్ వాత్సల్య పథకం బాసటగా నిలిచింది. ఆ కుటుంబానికి చెందిన బాలుడి అక్కకు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ‘మిషన్ వాత్సల్య’ కింద ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకం కింద బాలికకు ప్రతి నెల నాలుగు వేల రూపాయల చొప్పున 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆర్థిక సహాయం అందించనున్నది.
ఇప్పటివరకు గడిచిన మూడు నెలలకు రూ. 4 వేలు చొప్పున మొత్తం 12వేల రూపాయలు బాలిక చదువు నిమిత్తం నేరుగా కుటుంబ ఖాతాలో జమ చేయనున్నది. కాగా ‘మిషన్ వాత్సల్య’ కేంద్ర ప్రభుత్వానికి చెందింది. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి అందించిన సహాయానికి బాధిత కుటుంబం చైల్డ్ రైట్స్ కమిషన్కు కృతజ్ఞతలు తెలిపింది.