15 April, 2026 | 7:30 AM

మంచినీళ్లతో కారు కడిగినందుకు ఫైన్

26-11-2025 12:41 AM

రూ.10 వేల జరిమానా వేసిన జలమండలి ఎండీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): జలమండలి సరఫరా చేసే మంచినీటితో కారు కడిగిన వ్యక్తికి అధికారులు భారీ జరిమానా విధించారు. హైదరా బాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి మంగళవారం బంజారాహిల్స్ ప్రాంతం లో పర్యటించారు. రోడ్ నం.12లో ఓ వ్యక్తి తన ఇంటి ముందు జలమండలి సరఫరా చేసే మంచినీటితో తన కారును కడుగుతూ కనిపించాడు.

గమనించిన ఎండీ తన వాహనాన్ని ఆపి, సదరు వ్యక్తిని మందలించారు. సంబంధిత డివిజన్ మేనేజర్‌ను పిలిపించి, ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎండీ ఆదేశాల మేరకు అధికారులు కారు యజమానికి రూ.10 వేల జరిమానా విధించారు.

ఈ సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి నగర ప్రజలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. జలమండలి సరఫరా చేసే నీరు కేవలం తాగునీటి అవసరాల కోసమేనని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నీటిని వాహనాలు కడగడానికి గానీ, గార్డెనింగ్‌కుగానీ, ఇతర వ్యాపార అవసరాలకు గానీ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.