22-05-2025 01:09:48 AM
ములుగు (మహబూబాబాద్), మే 21 (విజయ క్రాంతి): అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ వరద నష్టాలను తగ్గించేందుకు కృషి చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ దిశా నిర్దేశం చేశారు.
ములుగు కలెక్టరేట్లో వర్షాలు వరదల కారణంగా నష్ట నివారణ చర్యలపై ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడానికి ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్ జీ, సంపత్ రావు, డి.ఎస్.పి రవీందర్ తో కలిసి జిల్లాలోని తహసిల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం ఉండడం వల్ల వాగుల వరద ఉధృతి కారణంగా కలిగే ఇబ్బందులను, జరిగే నష్టాన్ని ముందుగా అంచనా వేసుకోవాలని, ప్రణాళికతో ముందస్తు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వరదల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తించకుండా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. శిథిలమైన ఇండ్లు, విద్యుత్ స్తంభాలు, చెట్లను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.