14-09-2025 12:20:51 AM
కుమ్రం భీం జిల్లాలో విషాదం
కుమ్రం భీం ఆసిఫాబాద్, సెప్టెంబర్ ౧౩(విజయక్రాంతి)ః కుమ్రం భీం జిల్లా వాంకిడి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాంకిడి మండలంలోని దాబా గ్రామానికి చెందిన నలుగురు చికిలి వాగు లో మునిగి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మోర్లే నిర్మల భాయి(౩౫) పొలం పనులకు వెళ్తూ వెంట కుమారుడు మోర్లే గణేష్(౧౨), మరో కుటుంబానికి చెందిన వాడే మహేశ్వరి(౧౦), శశికళ(౧౦)ను తీసుకెళ్లింది.
వాగు వద్ద యూరియా ఖాళీ బస్తాలు నీటిలో కడుగుతుండగా ఒక బస్తా కొట్టుకుపోయింది. దీంతో గణేష్(౧౨) వాగులో దిగి ఆ గోతాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించి ఆ బాలుడు కూడా నీటిలో కొట్టుకుపోయాడు. గమనించిన గణేష్ తల్లి నిర్మల కొడుకును కాపాడేం దుకు నీటిలో దిగింది. ఆమె వెంట శశికళ, మహేశ్వరి నీటిలో దిగడంతో నలుగురు వాగులో గల్లంతయ్యారు.
ఒడ్డున ఉన్న మరో బాలిక గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్య లు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ముగ్గురు పిల్లలతో పాటు తల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.