18-11-2025 08:10:17 PM
ఒక్కొక్కరికి 12 వేల రూపాయల జరిమానా..
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండల పరిధిలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితులైన నలుగురికి ఐదు సంవత్సరాల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.12,000 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఈ శిక్షను జిల్లా ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్ ప్రకటించారు. పిర్యాదుదారురాలు ఫిర్యాదు ప్రకారం, 05-12-2020 న ఫిర్యాదు దారురాలు ఆమె కూతురు(మైనర్ బాలిక)ఇంట్లో ఉన్న సమయంలో బెజ్జుర్ మండలంలోని తలాయి గ్రామానికి చెందిన చౌదరి జలపతి, చౌదరి సుధాకర్, లంగారి కృష్ణయ్య, లంగారి అంకయ్యలు తమ ఇంటికి వచ్చి దాడి ప్రయత్నం చేసి, అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై బెజ్జుర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తు బాధ్యతలో మొదటి ఐ.ఓ ఆశన్న (ఎ.ఎస్.ఐ), రెండవ ఐ.ఓ ఎస్సై సందీప్, మూడవ ఐ.ఓ ఎస్సై డి.సాగర్ చేపట్టారు. కోర్టులో ఫోక్సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.శ్రీనివాస్ బలమైన వాదనలు వినిపించగా, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, సిడిపిఓ రామ్ సింగ్ (ఎ.ఎస్.ఐ), సి డి ఓ బాలాజీలు సహకరించారు.సాక్షాలు సాక్షాధారాలు దర్యాప్తు నివేదికను పరిశీలించిన కోర్టు పై నలుగురిని దోషులుగా తేల్చి, ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాల కఠిన కారకార శిక్షతో పాటు 12 వేల రూపాయల జరిమానా విధించింది. ప్రస్తుత ఎస్ఐ సార్తజ్ పాషా, కౌటాల సీఐ సంతోష్ కుమార్, డిఎస్పీ వాహిదుద్దీన్ కేసు పర్యవేక్షణలో ఉన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అభినందించారు.