03-07-2025 01:45:16 AM
-స్థానిక సంస్థల్లో అన్నింటిని గెలవాలి
-మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎం
-కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరు కొనలేరు
-కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు
-పీసీసీ ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్, ప్రధాన కార్యదర్శి దయాకర్
గజ్వేల్ /సిద్దిపేట రూరల్, జూలై 2 : రాష్ట్రంలో గజ్వేల్ నియోజకవర్గంలో గెలుపు ఎంతో ముఖ్యమైనదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని మెదక్ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల ఇన్చార్జిలు, పిసిసి ఉపాధ్యక్షులు నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి చనగని దయాకర్ లు అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం డిసిసి అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వారు హాజరై మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అద్భుతంగా అమలు చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమన్నారు. ఇది సెక్యూలర్ ప్రభుత్వమని, అందరినీ ఒకేలా చూస్తుందన్నారు. మరో పదేళ్లు రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల పై ఉందన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఎంతో కష్టకాలంలో పార్టీని బలంగా నిలబెట్టిన డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి కెసిఆర్ కు కూడా చెమటలు పట్టించారని గుర్తు చేశారు. ఆయనకు అండగా నిలిచిన కార్యకర్తలను ఈ సందర్భంగా అభినందించారు. ఎంత డబ్బులు ఖర్చు చేసినా కాంగ్రెస్ కార్యకర్తలను కొనలేరన్నారు. నాయకుల మధ్య విబేధాలు, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఈనెల 4వ తేదీ ఆదివారం హైదరాబాదులో జరగనున్న భారీ బహిరంగ సభ లో ఐసీసీ అధ్యక్షుడు ఖర్గే హాజరవుతున్నారని, గజ్వెల్ నుండి 2వేల మంది తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
కార్పొరేషన్ ల మాజీ చైర్మన్ లు మడుపు భూం రెడ్డి, గంగుమల్ల ఎలక్షన్ రెడ్డి, ఏఎంసి చైర్మన్ లు వంటేరు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్, వైస్ చైర్మన్ సర్ధార్ ఖాన్, జిల్లా నాయకులు నిమ్మ రంగారెడ్డి, తూప్రాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్లు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, ఆయా మండల పార్టీల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్దిపేటలో...
సిద్ధిపేట నియోజవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి టిపిసిసి జనరల్ సెక్రెటరీ అసదుద్దీన్ పాల్గొని మాట్లాడారు. బూత్, మండల, జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని, అందరు కలిసి పార్టీకోసం పనీ చెయ్యాలని, కష్టపడ్డ వారినే పార్టీ గుర్తించి నామినేట్ పదవులు ఇస్తుందన్నారు. హైద్రాబాద్ లో జరగబోయే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ కర్గే సభకు కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభనీ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి సిద్ధిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్, అర్బన్, నంగునూర్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండలాల అద్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ అద్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.