29-10-2025 07:23:09 PM
 
							తుఫాను బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మొంథా తుఫాను రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లా వ్యాప్తంగా వరి,పత్తి తదితర రైతులు,కౌలు రైతుల పంటలతో పాటు సాధారణ,పేద ప్రజలకు ఇండ్లు,ఆస్తినష్టం జరిగిందని ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందజేసి రైతన్నలకు అండగా ఉండాలని అఖిల భారత రైతుకూలి సంఘం(ఏఐకేఎంఎస్)జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం మండల పరిధిలోని కొమ్మాల గ్రామంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, వరి, పత్తి పంటలు మార్కెట్లకు వస్తున్న తరుణంలో మొంథా తుఫాను వల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి మొలకెత్తుతుందని, తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ తో సంబంధం లేకుండా ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.