11-09-2025 01:23:42 AM
-జీవో నంబర్ 29ని వెంటనే రద్దు చేయాలి
-అశోక్ నగర్ చౌరస్తా లో నిరుద్యోగుల ఆందోళన
ముషీరాబాద్, సెప్టెంబర్ 10(విజయక్రాంతి ): గ్రూప్ -1 మెయిన్స్ పేపర్స్ ను రీవాల్యుయేషన్ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని గ్రూప్ -1 అభ్యర్థులు రవికుమార్, జనార్ధన్ లు అన్నారు. ఈ మేరకు బుధవారం హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.
జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, జీవో నెంబర్ 29 ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోర్టు తీర్పు టీజీపీఎస్సీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ఈ తీర్పు టీజీపీఎస్సీ డివిజన్ పెంచి వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో తాము కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.
జీవో వెంటనే రద్దుచేసి గ్రూప్-1ప్రిలిమ్స్ నుంచి నిర్వహించాలన్నారు. టీఎస్పీఎస్సీలో మొదటి నుంచి అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని తమకు సహకరించిన వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.