27-10-2025 01:04:52 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: డిజిటల్ అరెస్ట్ల మోసానికి గురై రూ.కోటికి పైగా పోగొట్టుకున్న వృద్ధ బాధితుల కేసును సుప్రీం కోర్టు సోమవారం విచారణ చేయనుంది. ఈ విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కూడిన ధర్మాసనం జరుపుతుందని కాజ్ లిస్ట్ పేర్కొంది.
ఈ తరహా నేరాలపై ఈ నెల 17న జరిపిన విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పోలీసల సమన్వయంతో దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఐ వంటివి స్పందించాలని పేర్కొంది.
కొందరు మోసగాళ్లు హరియాణాలోని అంబాల పట్టణంలో ఓ వృద్ధ దంపతులకు కోర్టు జారీ చేసినట్టుగా ఫోర్జరీ పత్రాలు చూపించి, వారి నుంచి రూ.1.05 కోట్లు కొట్టేసిన ఘటనపై సుప్రీంకోర్టు స్వయంగా విచారణ చేపట్టింది. ఇలాంటి మోసాలు న్యాయవ్యవస్థ గౌరవాన్ని, హుందాతనాన్ని దెబ్బ తీస్తాయని, ఇలాంటి నేరాలను సాధారణమైన మోసాలుగా, సైబర్ క్రైమ్ కేసులుగా పరిగణించ వద్దని అభిప్రాయం వ్యక్తం చేసింది.