05-11-2025 01:13:56 AM
-6, 7, 12, 13 తేదీల్లో విచారించాలని నిర్ణయం
-షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్
హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు. అందుకు సంబంధించి షెడ్యూల్ని మంగళవారం విడుదల చేశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లాం వెంకట్రావు, అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్లపై ఈ నెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ చేపడతామని, మొదట పిటిషనర్లు.. ఆ తర్వాత ప్రతివాదుల క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుందని స్పీకర్ తెలిపారు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ఉంటుందని స్పీకర్ పేర్కొన్నారు. కాగా, రాష్ర్టంలో ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్లపై విచారణకు శాసనసభ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టును గడువు కోరిన విషయం తెలిసిందే. గతంలో కోర్టు విధించిన మూడు నెలల గడువు అక్టోబర్ 31తో పూర్తికావడంతో రెండు నెలల గడువు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం కోరింది. ఇప్పటి వరకు కేవలం నలుగురు ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తయింది.