01-10-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : ఆసియా కప్ హైడ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ ముగిసి రెండు రోజు లైనా చాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందలేదు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహిసిన్ సఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకునేందుకు టీమిండియా నిరాకరించిన విషయం తెలిసిందే.
అయితే, దీనికి ప్రతిగా సఖ్వీ ట్రోఫితో పాటు భారత ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్ను తీసుకెళ్లిపోయాడు. కాగా, వాటిని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, స్వయంగా తానే భారత్ కెప్ట్న్కు ట్రోఫీ, మిగతా ఆటగాళ్లకు మెడల్స్ ఇస్తానని షరతు విధించాడట.దీనిని భారత ఆటగాళ్లు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ విషయంపై మంగళవారం జరగబోయే ఏసీసీ సమావేశంలో బీసీసీఐ సఖ్వీని తూర్పారబెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇది అతడి పదవికే ముప్పు తెచ్చిపె ట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.