18-05-2025 01:01:52 AM
హైదరాబాద్, మే 17 (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్బాబు కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నమోదైన నాన్బెయిలబుల్ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆగష్టు 23, 2017న పెద్దపల్లి జిల్లా బసంత్నగర్ పోలీస్స్టేషన్లో శ్రీధర్బాబుతో పాటు 13మందిపై నాన్బెయిలబుల్ కేసు నమోదు అయింది.
మరో 300మందిపై ఎఫ్ఐఆ ర్ ఫైల్ అయింది. 8 సంవత్సరాలు గడిచిన తర్వాత సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడంతో శనివారం కోర్టు కేసు కొట్టివే సింది. మంత్రితో పాటు 13మందిపై కూడా కేసును కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజలు, రైతుల విజయమన్నారు.
పేద రైతుల ఘోషను న్యాయస్థానం అర్థం చేసుకుందన్నారు. ఈ తీర్పు న్యాయవ్యవస్థపై మరింత గౌరవా న్ని పెంచిందన్నారు. మనది ప్రజాస్వామ్యదేశమని, తప్పు చేస్తే తప్పకుండా శిక్షపడాలన్నారు. అధికారం ఉంది కదా అని అప్ప టి బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమపై అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు.
న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉంచామని, న్యాయపరంగా 8 ఏళ్లు పోరాటం చేశామని, చివరకు న్యాయమే గెలిచిందన్నారు. కాళేశ్వరంతో తమ ప్రాంతానికి ఒరిగిందేం లేదని, అసలు వాళ్లు కట్టిన ప్రాజెక్టే నిలవలేదని, త్వరలోనే ఈ వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని శ్రీధర్బాబు అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తాము ప్రజా విచారణ చేస్తున్న సందర్భంగా రైతుల హక్కులను కాపాడాలని విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లామని, అధికారం ఉం దని తమపై అన్యాయంగా వివిధ సెక్షన్ల కింద నాన్బెయిలబుల్ కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నడిరోడ్డుపై న్యాయవాది దంపతులను చంపితే, అసలు నేరస్థులను బయటకు రాకుండా కాపాడిందని మంత్రి ఆరోపించారు.
ఎప్పటికైనా దోషులకు తప్పకుండా శిక్ష పడుతుందనే నమ్మకం ఉందన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు వెళ్తుందన్నారు.