16-12-2024 01:17:36 AM
ఇన్స్టాలో పరిచయం, 8 నెలల సహజీవనం
పెయిన్ కిల్లర్ మాత్రలు మింగి స్పృహ కోల్పోయిన భార్య
భయంతో వంటిమామిడి అడవిలో వదిలి వెళ్లిన భర్త
గజ్వేల్, డిసెంబర్ 15: భార్య గొడవపడి నిద్ర మాత్రలు మింగి స్పృహ కోల్పోవడంతో భయపడిన భర్త ఆమెను అడవిలో వదలివెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అటవీ ప్రాంతం లో శనివారం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి ఆది వారం బాధిత మహిళ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్(28) ఉద్యోగ రీత్యా బెంగుళూరులో ఉంటున్నాడు.
బెంగుళూరుకు చెందిన రబియా(22)తో ఇన్స్టాలో పరిచయం ఏర్పడి ఒకరినొకరు ఇష్టపడి 8 నెలలు సహజీవనం చేశారు. ఈ నెల 4వ తేదీన వివాహం చేసుకున్నారు. అయితే మన్వర్ తల్లిదండ్రులు జీవనోపాధి కోసం వచ్చి నివాసముంటున్న మేడ్చల్ జిల్లా అల్వాల్కి మన్వర్ రబియాను కాపురానికి తీసుకొచ్చాడు. మన్వర్ తల్లిదండ్రులు అమ్మాయిని విడిచిపెట్టాలని ఒత్తిడి తెచ్చారు.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రబియాపై అత్తమామలు, భర్త ఒత్తిడి ఎక్కువైంది. ప్రేమపేరుతో మోసపోయానని మనస్థాపానికి గురైన రబియా శనివారం నిద్రమాత్రలు మింగి స్పృహ కోల్పోయింది. దీంతో మన్వర్ తన భార్య రబియాను వదిలించుకోవాలని బస్సులో అల్వాల్ నుంచి వంటిమామిడి అటవీ ప్రాంతానికి తీసుకొచ్చి వదిలేసి వెళ్లిపోయాడంటూ రబియా తన బాధను వ్యక్తం చేసింది. తతంగాన్ని గమనించిన స్థానిక మక్కకంకుల వ్యాపారులు పోలీసులకు సమాచారమిచ్చారు.