11-12-2025 12:00:00 AM
ఆధార్ కార్డు మార్పుల కోసం తప్పనిసరిగా ప్రయాణం
బెజ్జూర్, డిసెంబర్ ౧౦ (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాలకు చెందిన ప్రజలు ఆధార్ కార్డు వివరాలు, పేరు మార్పులు చేయించుకోవడానికి తప్పనిసరిగా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ఆధార్ సెంటర్లలో రెండోసారి మార్పులు చేసిన తర్వాత మూడోసారి మార్పులు చేయడం సాధ్యంకాదని అధికారులు తెలుపడంతో, బాధితులు హైదరాబాద్లోని ఆధార్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వస్తోంది.
బెజ్జూర్ మండల కేంద్రం నుండి పెంచికల్పేట్ మీదుగా హైదరాబాద్కు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందిస్తే ఎంతోమంది ప్రయాణికులకు ఉపయోపడుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఆధార్ మార్పుల కోసం వెళ్లేవారితో పాటు, హైదరాబాద్లో ఉపాధి కోసం కష్టపడుతున్న నిరుద్యోగులు, హాస్పిటల్కు వెళ్లే రోగులు, వ్యాపార వర్గాలు , ప్రజలకు ఈ బస్సు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అడ్రస్ తెలియక, రెండు మూడు రోజుల పాటు తిరిగి, క్యూల్లో నిల్చొని, ఇబ్బందులు పడి ఆధార్ వివరాలు సవరించుకోవాల్సి వస్తుందని బాధితులు చెబుతున్నారు.పేరు రెండుసార్లు, డేట్ అఫ్ బర్త్ ఒకసారి, లింగము మార్పుకు హైదరాబాద్లోని అమీర్పేట్ ప్రాంతీయ కార్యాల యానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
బెజ్జూర్ నుండి రాత్రి 8 గంటల సమయంలో బస్సు నడిపితే, హైదరాబాద్లో పనులు ముగించుకొని అదే బస్సులో తిరుగు ప్రయాణం చేయగలమని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రస్తు తం బస్సు సౌకర్యం లేక 30 కిలోమీటర్లు కౌటాలకు వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డిపో మేనేజర్ తక్షణమే స్పందించి హైదరాబాద్ బస్సు సర్వీసు ప్రారంభించాలని మండలాల ప్రజలు కోరుతున్నారు.