19-11-2025 10:54:54 PM
కర్మన్ ఘాట్ లో 450 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా అధికారులు..
ఎల్బీనగర్: హైడ్రా అధికారులు తమకు ఇచ్చిన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నారు. సరూర్నగర్ మండలం కర్మన్ ఘాట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్లో పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. 1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లేఔట్ వేశారు. దాదాపు 450 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంతమంది వ్యక్తులు ఈ పార్కు స్థలంపై అనధికార గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను ఆక్రమణదారులు బెదిరించారు. కాలనీవాసులు హైడ్రాకి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ తదితర అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించగా, ఆ నిర్మాణం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాని పూర్తిగా అక్రమ నిర్మాణమని నిర్ధారించారు. హైడ్రా అధికారులు స్వయంగా అక్రమ గోడను తొలిగించి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు సాయి గణేష్ నగర్ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.