18-10-2025 01:05:10 AM
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా ‘కే ర్యాంప్’. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్లపై రాజేశ్ దండ, శివ బొమ్మకు నిర్మిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ నెల 18న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “మేమంతా ఒక మంచి సినిమా చేశామనే నమ్మకం ఉంది.
మంచి సినిమా చేసినప్పుడే ప్రేక్షకులను థియేటర్లకు రమ్మని నమ్మకంగా పిలుస్తాం. నా ఫ్యాన్స్ అన్నా పిలిస్తే కరిగిపోతాను. అన్న మంచి సినిమా చేశాడని మీరు చెప్పుకునేలా ప్రతి సినిమాకు బెటర్మెంట్ చేసుకుంటూ వస్తున్నా. మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను. ఈ నెల 18న ‘కే ర్యాంప్’ ర్యాంపేజ్ చూస్తారు. థియేటర్స్లోకి వెళ్లేముందు ఇది కంప్లీట్ ఎంటర్టైనర్ అని గుర్తుపెట్టుకోండి. మీ టికెట్ డబ్బులు వృథా కావు” అన్నారు. హీరోయిన్ యుక్తి తరేజా మాట్లాడుతూ.. “కే ర్యాంప్’ చూశాక ప్రేక్షకులు నన్ను మరింతగా ఇష్టపడతారు.
ఇందులో నా పాత్రకు చాలా లేయర్స్ ఉంటాయి” అన్నారు. డైరెక్టర్ నాని మాట్లాడుతూ.. “నేను ఇక్కడ మాట్లాడను. స్క్రీన్ మీద సినిమానే మాట్లాడుతుంది” అని తెలిపారు. నిర్మాత రాజేశ్ దండ మాట్లాడుతూ.. “సెట్లో ప్రతిరోజూ నవ్వుకున్నాం. సెట్లో నవ్వించిన ఏ సినిమా కూడా సక్సెస్ విషయంలో గురి తప్పదు. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆదరిస్తారు. ఈ దీపావళి చిత్రాలన్నీ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా” చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జగన్, డైరెక్టర్లు విజయ్ కనకమేడల, వీఐ ఆనంద్, రామ్ అబ్బరాజు, సుబ్బు, చిత్ర సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్, గీత రచయిత సురేంద్రకృష్ణ, నటీనటులు విమలా రామన్, కామ్నా జెఠ్మలానీ, సాయికుమార్, వీకే నరేశ్, శ్రీనివాసరెడ్డి, మురళీధర్గౌడ్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.