05-11-2025 04:13:07 PM
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లాలో ఇటీవల కురిసిన తుఫాన్ కారణంగా రహదారులు ధ్వంసం కావడంతో తక్షణమే బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉద్యమకారులపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ సర్కార్ దండుపాలెం ముఠా పాలన సాగిస్తుందని, రిమాండ్ కు తరలించిన ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఉద్యమకారులను పరామర్శించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత అసెంబ్లీలో రహదారిలో గతంలో కోతకు గురైన బ్రిడ్జీలను త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నిస్తే త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఆ హామీ శూన్యంగా మారిందని పేర్కొన్నారు. తుఫాన్ కారణంగా ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుందని ఉద్యమకారులు వెంటనే చీటకోడూర్ గానుపహాడ్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట మంత్రుల ఫోటో పెట్టి నిరసన తెలిపి ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేసి ప్రజలను రిమాండ్ కు తరలించారని, ఇదేనా ప్రజా పాలన అంటే ప్రజల సమస్యల కోసం పోరాడితే జైల్లో వేయడమేనా ప్రజా పాలన అని ఆరోపించారు. ఇప్పటికైనా అరెస్టు చేసిన ఉద్యమకారులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.