01-02-2026 01:33:02 AM
200 మంది కార్మికుల మృతి
కాంగో, జనవరి 31 : కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆ దేశ తూర్పు ప్రాంతంలోని రుబాయాలో ఉన్న ఒక భారీ కోల్టాన్ గని కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారు 200 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గని వద్ద ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఉత్తర కివు ప్రావిన్స్లో ఉన్న రుబాయా కొల్టాన్ గని ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది.
అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ గని ఒక్కసారిగా కుప్పకూలింది. గనిలో పని చేస్తున్న కార్మికులతో పాటు, అక్కడ వ్యాపారం చేసుకునే మహిళలు, చిన్న పిల్లలు కూడా ఈ ప్రమాదంలో మరణించారని స్థానిక గవర్నర్ ప్రతినిధి లుముంబా కాంబెరే ముయిసా ధృవీకరించారు. వర్షాల వల్ల భూమి మెత్తబడటంతో కొండచరియలు విరిగిపడి కార్మికులు ఉన్న లోతైన గుంతలను కప్పేశాయి. సుమారు 200 మందికి పైగా సజీవ సమాధి అయి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.