08-07-2025 01:59:50 AM
కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి జూన్ 7 ( విజయ క్రాంతి ): ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టcనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండుగ వాతావరణంలో నిర్వహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
సోమవారం రోజు భువనగిరి జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యుల సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజయోత్సవ సంబరాల సన్నద్ధత, కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9 వ తేదీన గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు విజయోత్సవ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. జిల్లాలోని అన్ని సంఘాల మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు.
మీ గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చి కట్టుకోలేని పరిస్థితి ఉన్న పేదలకి మహిళా సంఘాల తరుపున రుణాలు ఇప్పించి ఇళ్లు కట్టుకునే చిరకాల కోరికను నెరవేర్చాలన్నారు. త్వరలో మహిళా శక్తి కింద పెట్రోల్ బంకులు ఇస్తామన్నారు. వన మహోత్సవంలో బాగంగా మండలం జిల్లా సమాఖ్య కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మొక్క నాటి నీరు పోశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,జిల్లా విజిలెన్స్ అధికారి ఉపేందర్ రెడ్డి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సురేష్ , యం.పి.డి.ఓ ,యం.పి.ఓ, ఏ.పి.ఓ , జిల్లా సమాఖ్య కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.