25-07-2025 12:30:18 AM
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హెచ్చరిక
నిజామాబాద్, జులై 24 (విజయ క్రాంతి): మూడు నెలల గడువులోపు తన నియోజకవర్గనికి 3500 ఇందిరమ్మ ఇండ్లతో పాటు డబుల్ ఇండ్లు మరమ్మతు చేసి పంపిణి చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు మన నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా హౌసింగ్ మంత్రి పొంగులేటి గారి వైఖరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని సూర్యనారాయణ ఎద్దేవా చేసారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేవలం పరిమితమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇల్లు పంపిణీ చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన ఆరోపించారు.
గత కొంతకాలంగా మంత్రి సమీక్షలు నిర్వహిస్తూ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటాడం లేదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ప్రస్థావించిన ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లకు పొంగులేటి ఇచ్చిన హామీలను ఆయనగుర్తు చేసారు. గత ఏడాది కలెక్టర్, అధికారులతో సమీక్ష చేసి దసరాకే ఇళ్లు ఇస్తాం అన్నారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఎన్ని ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు జరిగాయో సమాధానం చెప్పాలని అన్నారు. జాగా ఉన్నవాళ్లకే ఇల్లు అంటున్నారు.
అర్బన్ ఏరియాలో ఒక కార్మికుడికి, ఒక ఆటో డ్రైవర్కి గజం జాగా దొరుకుతుందా? దొరకదనే విషయం ప్రభుత్వం అంగీకరించాలన్నారు. మొదటి విడతలో జాగా ఉన్నవాళ్లతో పాటు లేనివాళ్లకు ఇళ్ళు నిర్మించి 3500 భర్తీ చేయాలన్నారు. లబ్ధిదారులతో ఆందోళన దిగుతామని ఆయన మరోసారి హెచ్చరించారు. మా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇళ్లు ఇస్తోంది.కేంద్రం వాటా కలిపి ఇస్తున్న ఇండ్లపై ప్రధాని పేరు, ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు.