08-05-2025 12:31:38 AM
డిజిటల్ విభాగంలో 15, సోషల్ మీడియా క్యాటగిరీలో 50కి పైగా అవార్డులు
పాల్గొన్న నటులు శివారెడ్డి, శ్రీనాథ్ మాగంటి, ఇతర సెలబ్రిటీలు
హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): మంచి కంటెంట్ను అందించినప్పుడే ఇన్ ఫ్లూయెన్సర్లు, డిజిటల్ క్రియేటర్లకు విజయం దక్కుతుందని ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ సూచించారు. చాలా మంది రకరకాల కంటెంట్ను సృష్టిస్తుంటారని.. కానీ బాధ్యతతో అది చేసినప్పుడే వీక్షకుల్లో నమ్మకం పెరుగుతుందని చెప్పారు. హై బిజ్ టీవీ డిజిటల్ మీడియా, ఇన్ ఫ్లూయెన్సర్ అవార్డ్స్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రసంగం పంచ్ డైలాగులకు అక్కడున్న వారంతా చప్పట్లతో హోరెత్తించారు. నటులు శివారెడ్డి, శ్రీనాథ్ మాగంటి, గగన్ విహారి, జోగి నాయుడు, బిగ్ బాస్ ఫేం అశ్వినీ శ్రీతో పాటు భారతి సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఎం రవీందర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ పాండు రంగారావు (ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్), ఎం రాజ్గోపాల్ (ఎండీ - హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జే సంధ్యారాణి (ఎండీ హై బిజ్ టీవీ ఎల్ఎల్పీ) తదితరులు హాజరయ్యారు.
డిజిటల్ మీడియా, ఇన్ఫ్లూయెన్సర్ అవార్డ్స్లో భాగంగా 15 మంది డిజిటల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్కు హై బిజ్ టీవీ పురస్కారాలు ఇచ్చింది. అలాగే 50 మందికి పైగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను సత్కరించింది. కాగా ఇలాంటి అవార్డులు ఇవ్వడం హైదరాబాద్లో ఇదే తొలిసారి కావడం విశేషం.