09-02-2025 11:17:39 PM
డంపింగ్యార్డుపై ఉదృతపోరాటానికి సిద్ధమైన ప్రజలు
గుమ్మడిదల మండల జేఏసీ ఏర్పాటు
ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ
పటాన్చెరు: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మండల ప్రజలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. నల్లవల్లి గ్రామంలో చేపట్టిన దర్నాలో మండల రైతు సంఘాల జేఏసీ పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం మండల కేంద్రం గుమ్మడిదలలో మండల రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన, దర్నాలో మంబాపూర్ గ్రామ యువకులు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు. మరో వైపు నర్సాపూర్ పట్టణంలో నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జేఏసీ ఏర్పాటు చేశారు. పార్టీలను పక్కనపెట్టి పోరాటినికి సిద్దమయ్యారు. తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా సోమవారం నుంచి పోరాటాలు చేసేందుకు జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ సిద్ధం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలతో కలిసి ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటాలను ఉదృతం చేసేందుకు జేఏసీ సిద్దమైంది. గుమ్మడిదల మండలంలో అందరూ చిన్న, సన్నకారు రైతులే అని, డంప్యార్డు ఏర్పడితే భూములు కాలుష్యం భారిన పడతాయని, కూరగాయలు, వరిసాగు సాధ్యం కాదని, ప్రజలందరూ అనారోగ్యాలతో ఆసుపత్రులపాలవుతామని ఇన్ని సమస్యల నుంచి అందరం బయటపడాలంటే డంప్యార్డును ఏర్పాటు జరగనివ్వొద్దని తీర్మాణించారు. మరోవైపు గుమ్మడిదల, నల్లవల్లి, బొంతపల్లి కమాన్ తదితర ప్రాంతాలలో పోలీసుల పహార కొనసాగుతూనే ఉంది. ప్యారానగర్లో పోలీసు బందోబస్తు నడుమ డంపింగ్ యార్డుకు సంబందించి రోడ్లు, ప్రహారీ నిర్మాణం జరుగుతోంది.