04-07-2025 12:19:49 AM
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ఐటీ బోనాల జాతర నిర్వహిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్ను టీ-హబ్ వేదికగా గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీటా ద్వారా తెలంగాణ సంస్కృతిని ఐటీ కారిడార్లో కూడా విస్తృతం చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
కార్యక్రమంలో టీటా గ్లోబల్ అధ్యక్షు డు సందీప్కుమార్మక్తాలా, బోనాల నిర్వహణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఐటీ బోనాల వేడుకలు, తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ భాగస్వామ్యంతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సందీప్మక్తాలా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీటా బోనా లు కేవలం పండగ మాత్రమే కాదని, మన మూ లాలను గుర్తుచేసే మౌలిక సంకేతమని స్పష్టం చేశారు.
వేడుకల్లో ప్రధాన ఆకర్షణ గా, శిల్పకళా వేదిక నుంచి చిన్న పెద్దమ్మ దేవస్థానానికి భారీ ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇన్ఫోసిస్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి వచ్చిన 21 బోనాలు, తమ తమ కార్యాలయాల నుంచి బయలుదేరి శిల్పకళా వేదిక వద్ద కలుస్తాయి.
అక్కడి నుంచి ఊరేగింపుగా చిన్న పెద్దమ్మ దేవస్థానానికి చేరుతాయి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగ్యలక్ష్మి వాకిటి, శ్రీనివాస్ మారి, హరిని గోలి, యామిని, మనసా, దినేశ్, కీర్తన్, ప్రణీత్, వెంకట్ బూరా తదితరులు పాల్గొన్నారు.