04-07-2025 12:43:04 AM
బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి
గజ్వేల్, జులై 3 : కాలేశ్వరం వద్ద మరమ్మత్తులు చేసి వెంటనే రిజర్వాయర్ల ద్వారా రైతులకు సాగునీటిని అందించాలని గజ్వేల్ బిఆర్ఎస్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి రూ. 90 వేల కోట్లే ఖర్చయిందని, లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి బూటకపు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాలేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం కాలేశ్వరం మాత్రమే కాదని కాలేశ్వరం అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ లే అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూసీ నదికి కూడా లిఫ్టింగ్ ద్వారా జలాలను తరలించవచ్చని సూచించారు.
కెసిఆర్ తెలంగాణ రైతులకు కాలేశ్వరం ప్రాజెక్టుతో జల సంపద సృష్టించాడని, కాలేశ్వరం కృంగిపోయిందంటూ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. పాలన చేతకాని సీఎం రేవంత్ రెడ్డి కాలేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కాలేశ్వరం రిజర్వాయర్ వద్ద రూ. 100 కోట్లతో పనులు పూర్తి చేయవచ్చని, చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేసి కాలువల ద్వారా రైతులకు సాగునీరుని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులతో కలిసి రాజీవ్ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్ సీ రాజమౌళి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్, చందు, బాలేష్, మరికంటి కనకయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నాయకులు భూపాల్ రెడ్డి, నర్సింగరావు, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.