07-11-2025 01:34:12 AM
జూబ్లీహిల్స్ ప్రచారంలో ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): కేసీఆర్ కుటుం బం ఓ దొంగల ముఠా అని, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, కుక్కలు చింపిన విస్తరి చేశారని ఎమ్మెల్సీ విజయశాంతి విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచా రంలో భాగంగా గురువారం బోరబండ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా ఎమ్మెల్సీ విజయశాంతి ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై, ఆయన కుటుంబ పాలనపై నిప్పులు చెరిగారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, కుక్కలు చింపిన విస్తరి చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన కుటుంబం మాత్రమే ఆర్థికంగా బలపడింది, కానీ తెలంగాణ ప్రజల మీద లక్షల కోట్ల అప్పుల కుప్ప పెట్టాడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కాములు చేసి తెలంగాణను దోచుకున్నదని ఆరోపించారు.
ఇప్పుడు అదే దొంగల ముఠా, కాంగ్రెస్ అభ్యర్థిని విమర్శించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా... పేరేదైనా ఆ పార్టీది ఒకటే దారి అని, రానున్న రోజుల్లో ఆ పార్టీ బీజేపీతో కలవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం, జాతీయ సమగ్రత, అంబేడ్కర్ ఆశయాలు అని, కాంగ్రెస్కు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.