02-10-2025 01:26:48 AM
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి(విజయక్రాంతి): శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని తిప్పికొట్టా రు. గాజులరామారం సర్వే నెంబర్ 307 (పార్ట్) భూమి ప్రభుత్వానికి సంబంధించినదికాదని, అది తమ కుటుంబం చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్రైవేట్ పట్టా భూమి అని స్పష్టం చేశారు. 1991 నుంచే సంబంధిత భూమి రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూమిగా నమోదైందని గాంధీ చెప్పారు.
2006లో తన రాజకీయ జీవితం ప్రారంభమయ్యేలోపే కుటుంబ సభ్యు లు మరికొందరితో కలసి 11 ఎకరాలు చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వివరించారు. 2008లో ఈ భూములపై హైకోర్టులో కేసులు నడిచినప్పటికీ, ఏపీఎస్ ఎఫ్సీ తమ కౌంటర్ అఫిడవిట్లో ఈ భూమి తమదికాదని, స్వాధీనం చేసుకోవాలన్న ఉద్దేశం లేదని స్పష్టంగా చెప్పిందని గుర్తుచేశారు. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ కూడా అదే విషయా న్ని ధృవీకరించారని తెలిపారు.
అంతేకాకుండా, హైకోర్టు తీర్పులోనూ ఈ భూములు ఇనాం భూములు కావని స్పష్టమైందని పేర్కొన్నారు. అయితే ఇటీవల హైడ్రా అధికారు లు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఆదివారం రోజునే భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ను కూల్చివేయడం పూర్తి గా చట్టవిరుద్ధమని గాంధీ మండిపడ్డారు. ఆ చర్యపై హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం హైడ్రా ప్రవేశం నిలిపివేయబడిందని తెలిపారు.
ఇదంతా తమపై తప్పుడు ఆరోపణలు సృష్టించి రాజకీయ లాభం పొందాలన్న ప్రయత్నమేనని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమిగా చూపించడం పెద్ద కుట్ర అని అన్నారు. వాస్తవాలను పరిశీలించకుండా అసత్యాలు ప్రచారం చేయ డం ప్రజలను తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. ఎవరైనా తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గాంధీ హెచ్చరించారు.